తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)..
ప్రస్తుతం రాష్ట్రంలో ‘సిట్’ (SIT) అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు, అది రేవంత్ రెడ్డి మార్చిన స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు లీకులు ఇస్తూ ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు. కేటీఆర్ పైన, తన పైన వస్తున్న ఆరోపణలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని, బావమరిది స్కామ్ బయటపడటంతోనే రేవంత్ రెడ్డికి వణుకు మొదలైందని విమర్శించారు.
సింగరేణి ఇక సృజన్ గని..
‘తెలంగాణ సిరుల గనిగా పేరున్న సింగరేణి, నేడు రేవంత్ పాలనలో సృజన్ గనిగా మారిపోయింది’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సింగరేణిలో జరుగుతున్న ప్రధాన కుంభకోణాలను ఆయన ఈ క్రింది విధంగా వివరించారు:
సోలార్ పవర్ స్కామ్: 107 మెగావాట్ల సోలార్ ప్లాంట్ టెండర్లలో భారీ అవినీతి జరిగింది. ఎమ్మెస్ఎంఈలను దూరం పెట్టడానికి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన తెచ్చి, తమ అనువాయులకు రూ. 250 కోట్లు అదనంగా లాభం చేకూర్చారు. నేషనల్ యావరేజ్ కంటే రెట్టింపు ధరకే టెండర్లు కట్టబెట్టారు.
67 మెగావాట్ల స్కామ్: ఇక్కడ కూడా నిబంధనలు మార్చి దాదాపు రూ. 250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.
ఎక్స్ప్లోజివ్స్ స్కామ్: జిలెటిన్ స్టిక్స్ కొనుగోలులో 30% అదనపు ధరకు అంగీకరించని అధికారులను వేధించి, వారిని పదవుల నుంచి తొలగించారని వెల్లడించారు.
ప్రకాశం గని & శ్రీరాంపూర్ ఓబీ స్కామ్: రూ. 1044 కోట్ల ప్రకాశం గని టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లను సెటిల్మెంట్ల కోసం ఏడుసార్లు వాయిదా వేశారని ఆరోపించారు.
కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై రివ్యూ చేస్తున్న నేపథ్యంలో.. ఈ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హరీష్ రావు లేఖ రాశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఫెవికాల్ బంధం’ లేకపోతే, వెంటనే ఈ టెండర్లను రద్దు చేయించి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన బావమరిదిపై విచారణ జరిపించాలని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఇలాంటి డ్రామాలతో కాలం వెళ్లదీయొద్దని హరీష్ రావు హెచ్చరించారు.