తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన భారత్ రాష్ట్ర సమితి (BRS)కు మరో షాక్ తగిలింది. కొందరు కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి జైకొట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 38 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు తెలంగాణ ఓటర్లు.
మొత్తంగా 66 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ ప్రభంజనం ముందు ఆరుమంది మంత్రులు సైతం మట్టికరిచారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించారు. ఈ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ను ఆహ్వానించారు.
ఈ ఓటమి భారం నుంచి తేరుకోకముందే కొత్త ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడటానికి రెడీ అయ్యారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్తో ఈ వలసలు మొదలయ్యాయి. తెల్లం వెంకట్రావ్ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ప్రకటించారు.
ఇది ఇక్కడితో ఆగట్లేదు. అదే దారిలో మరికొందరు సీనియర్లు నడవడానికి సిద్ధపడినట్లు సమాచారం. మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. సబిత ఇంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణా రావు, వివేక్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ కూడా కాంగ్రెస్కు మద్దతు తెలిపే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వారందరూ అటు వెళ్తారని చెబుతున్నారు