ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడ వైరస్ అనుమానితులను క్వారంటైన్కు తరలించడం, నమూనాలు సేకరించడం పాజిటివ్గా తేలితే వారిని ప్రత్యేక ఐసొలేషన్ గదిలో పెట్టి వైద్యం చేయడం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన లండన్ యువకుడికి తొలిసారిగా జిల్లాలో పాజిటివ్ కేసుగా నమోదవడంతో యంత్రాంగంలో మరింత స్ఫూర్తిని నింపింది.
మతపరమైన ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టయిన 163 మందిని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు క్వారంటైన్కు తరలించారు. ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారితో కలిసిన వారుగా వైద్యులు వీరిని నిర్ధారించారు. వీరిలో 89 మందికి నెగిటివ్ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఇంకా నలుగురు మాత్రమే క్వారంటైన్లో ఉన్నారు. వీరికి కూడా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. బొమ్మూరు క్వారంటైన్లో 14 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నవారితోపాటు, మూడు రోజుల కిందట కరోనా నెగిటివ్ వచ్చిన వారికి చేతిపై స్టాంప్ వేసి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సరిత తెలిపారు.