ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో, దాని స్థానంలో తిరుపతిలోని అలిపిరి డిపో సమీపంలో 1.3 ఎకరాల స్థలంలో ₹3.89 కోట్ల వ్యయంతో ఈ కొత్త భవనాన్ని G+3 అంతస్తుల్లో నిర్మించారు. ఈ నూతన డిస్పెన్సరీని ఈ నెల 30న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ కొత్త భవనంలో రోగుల సౌకర్యార్థం లిఫ్ట్తో పాటు, ఒకేసారి 50 మందికి పైగా కూర్చునేలా విశాలమైన వెయిటింగ్ హాల్, ఫార్మసీ, ఓపీ కేంద్రం, వైద్యుల కోసం ప్రత్యేక గదులు వంటి సకల సౌకర్యాలు కల్పించారు. భవనంలోని మొదటి అంతస్తులో డిస్పెన్సరీ, రెండు, మూడు అంతస్తుల్లో గెస్ట్హౌస్ ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని 11 డిపోల సిబ్బందితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి దాదాపు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ డిస్పెన్సరీ ద్వారా రోజుకు సుమారు 100 మందికి ECG తో పాటు, సెమీ ఆటోమోటివ్ ఎనలైజర్ ద్వారా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు ₹3 లక్షల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ సేవలు ఇకపై కొత్త డిస్పెన్సరీలో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.