శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే.. ఆ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించాలి. కానీ ప్రస్తుత నీటి సంవత్సరం మొదటి రోజునే అంటే జూన్ 1న శ్రీశైలంలో 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది.
విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేసింది. జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు వదిలేసింది. విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే 848 అడుగులు దాటి ఉండేది.
శ్రీశైలం..
తెలంగాణ: జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో నీటి మట్టం ఎంత గరిష్టంగా ఉంటే.. విద్యుత్ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ ఎత్తులో నీటి మట్టం ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. నీటి మట్టం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్కు సమానం. తక్కువ ఎత్తు నుంచే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం నీటి మట్టం పెరగలేదు. దీనివల్ల తెలంగాణకూ నష్టమే. శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లందించలేని దుస్థితి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు: శ్రీశైలంలో నీటి మట్టం కనీసం 848 అడుగులకు చేరితేనే దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, చెన్నై నగరానికి అత్యవసరాల కోసం రెండు వేల క్యూసెక్కులనైనా తరలించే వీలు ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.
నాగార్జునసాగర్..
విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి వదిలేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షం వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో జూన్ 1 నుంచి ఇప్పటిదాకా నాగార్జునసాగర్లోకి 28.26 టీఎంసీలు వచ్చాయి. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ 31.22 టీఎంసీలను దిగువకు
వదిలేసింది.
తెలంగాణ: సాగర్లో 510 అడుగుల కంటే నీటి మట్టం దిగువకు చేరితే హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కాదు. సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.
ఆంధ్రప్రదేశ్: సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.