టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఈనెల 7న గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ నాయకులు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, 7న ఉదయం రేవంత్ తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయం చేరుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత 11 గంటలకు నాంపల్లిలోని దర్గా కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ చేరుకుంటారు.