ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీలు దాటి పరిగెడుతున్న క్రమంలో సామాన్యుడి నెత్తిమీద మరోభారం పడింది. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచే (జులై 1,2021) అమలులోకి వస్తాయని సదరు కంపెనీలు తెలిపాయి. దీంతో సామాన్యుడికి మరో భారం తప్పటంలేదు. గ్యాస్ కొనాలంటేనే హడలిపోయేలా ఉన్నాయి ధరలు. ఓ పక్క పెట్రోల్, డీజిల్ ధరలు మరోపక్క గ్యాస్ ధర కూడా పెరగటంతో సామాన్యుడి దిక్కుతోచని పరిస్థితిలో విలవిల్లాడుతున్నాడు.
పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్పై సైతం రూ.76 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1550కు చేరువైంది. హైదరాబాద్లో వంట గ్యాస్ సిలిండర్పై రూ.16 పెరిగింది. ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్పై రూ.84 పెరగ్గా.. రూ.1768కు పెరిగింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు ఇవాళ సవరించాయి.
ప్రతి ఐదురోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. ఈక్రమంలో గ్యాస్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి భారంగా మారింది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.122కు చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో 19 కిలో సిలిండర్ రూ.1473.50కు తగ్గింది. అయితే, సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పెరగ్గా మరోసారి సామాన్యుడికి ఈ భారం తప్పలేదు.
ఓపక్క కరోనా వల్ల ఆర్థికంగా నానా కష్టాలు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెరగటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు సామాన్య మానవుడు. ఈ అధిక ధరలతో ఇల్లు గడటమే కష్టంగా మారుతోంది. అయినా అంతకంతకూ ఈ భారాలు పెరుగుతున్నాయి..కానీ సామాన్యుడు ఆదాయం మాత్రం పెరగకపోగా కరోనా కష్టం వల్ల మరింతగా తగ్గిపోతోంది. ఈక్రమంలో పేదల సంఖ్య పెరుగుతోంది.