అంతరిక్షంలో శాటిలైట్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలు ఇప్పుడు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో పోస్టు చేసింది. ఈ ఉపగ్రహాలు అంతకుముందు వరకు ఒకదానికి ఒకటి 15 మీటర్ల దూరంలో ఉండేవి. తాజాగా వీటి మధ్య ఉన్న దూరం 12 మీటర్లకు తగ్గింది. దీంతో ప్రస్తుతం రెండు కవల శాటిలైట్ల మధ్య కేవలం 3 మీటర్లే ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరంలోకి తీసుకెళ్లారు. ఈ డేటాను విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఇస్రో వెల్లడించింది.
అంతకు ముందు, స్పేడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారు జామున 3:10 గంటలకు ఈ ఉపగ్రహాలను మొదట 105 మీటర్ల దూరంలో చేరుస్తూ, తరువాత అవి చేతులు కలపడానికి అంటే జంటగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో తెలిపింది.
నింగిలో డాకింగ్ కోసం ఇస్రో స్పేడెక్స్ ట్విన్ శాటిలైట్లను ప్రయోగించింది. అయితే అంతరిక్షంలో ‘హోల్డ్’ దశలో ఉంచారు. ఎస్డీఎక్స్01 (ఛేజర్) మరియు ఎస్డీఎక్స్02 (టార్గెట్) అనే ఈ రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా డిసెంబర్ 30, 2024న.. భూమి నుంచి ఆకాశంలోకి 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో ఈ ఉపగ్రహాలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, టెక్నికల్ కారణాల వల్ల అది వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఆ సమస్యలను ఇస్రో అధిగమించింది. ప్రస్తుదం డాకింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
ఈ శాటిలైట్లు పూర్తి స్థాయిలో వేగం పెరిగిన తర్వాత, బుల్లెట్ కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. రెండు శాటిలైట్లు అంతరిక్షంలో కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ క్లిష్టమైన ప్రక్రియ కోసం స్పేస్ డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు.
ఇప్పటివరకు ప్రపంచంలో ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అమెరికా, చైనా, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే విజయవంతంగా ప్రయోగించాయి. ఇప్పుడు ఇస్రో కూడా దీన్ని ఉపయోగించడంతో భారతదేశం టెక్నాలజీ రంగంలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. స్పేస్ డాకింగ్ అంటే, అంతరిక్షంలో స్వతంత్రంగా భ్రమణం చేసే రెండు శాటిలైట్లను కలపడం. అయితే ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇవి రెండూ చాలా అధిక వేగంతో, అంతరిక్షంలోని నియర్ వ్యాక్యూంలో (శూన్య ప్రదేశానికి సమీపంలో) భ్రమణం చేస్తూ ఉంటాయి.
ఈ ప్రయోగం కోసం రెండు ప్రత్యేక శాటిలైట్లను ఇస్రో డిజైన్ చేసింది. ఒక్కో శాటిలైట్ బరువు 220 కిలోగ్రాములు. భారతీయ డాకింగ్ సిస్టమ్ను ఇస్రో స్వతంత్రంగా అభివృద్ధి చేసింది, ఇది ప్రత్యేకమైన విషయం. పైగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) రూపొందించిన ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్కు, ఇస్రో రూపొందించిన భారతీయ డాకింగ్ సిస్టమ్ సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల, భారతీయ డాకింగ్ సిస్టమ్ను భారత్ పేటెంట్ చేసింది, ఎందుకంటే ఈ టెక్నాలజీ వివరాలను ఏ దేశం ఇతర దేశాలతో అంతర్జాతీయంగా పంచుకోదు. ఈ టెక్నాలజీ వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయి.
జాయింట్ శాటిలైట్ల స్పీడ్ గురించి చెప్పాలంటే, ఇవి గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే, ఒక కమర్షియల్ విమానం కంటే 36 రెట్లు ఎక్కువ వేగంతో, బుల్లెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇవి దూసుకుపోతున్నాయి. ఇంతటి స్పీడ్తో ప్రయాణం చేసేందుకు ఇస్రో ప్రత్యేకంగా వీటికి రాకెట్లు డిజైన్ చేసింది. వీటి స్పీడ్ని తగ్గించడానికి సెన్సార్లు కూడా ఇందులో అమర్చబడ్డాయి. వీటిని డాక్ చేసేముందు, వీటి స్పీడ్ను గంటకు 0.036 కిలోమీటర్ల వేగానికి తగ్గించారు. అయితే, అంతరిక్షంలోకి లాంచ్ చేసిన తర్వాత, వీటి స్పీడ్ను క్రమంగా పెంచుతారు.
ఈ హై స్పీడ్ శాటిలైట్ల పేర్లు చేజర్ మరియు టార్గెట్. ఒక్కసారి డాకింగ్ పూర్తయిన తర్వాత, ఇవి ఇద్దరు కలిసి ఒక అంతరిక్ష విమానంలా పనిచేస్తాయి. అయితే, ఈ రెండు జాయింట్ శాటిలైట్ల ప్రయోగంలో చాలా సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి ఒకే అర్బిట్లో ఉంటూ, ఒకదానితో మరొకటి ఢీకొనకుండా జాగ్రత్త పడాలి.