జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్..! జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు..!

పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు కేసు నమోదు చేసింది. ఫిర్యాదు కాపీలో ఆ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. జానీ మాస్టర్ అటు తన వృత్తిలో రాణిస్తున్నారు. దానితోపాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యారు. ఆయన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆ కొరియోగ్రాఫర్‌కు షాక్ ఇచ్చింది.

 

మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌ను ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని పేర్కొంటూ.. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

 

జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగికదాడి చేశాడని, క్రిమినల్ ఇంటిమిడేషన్, దాడి చేశాడనే ఆరోపణలతో సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. ఈ ఫిర్యాదు కాపీలో బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తాను తెలుగు ఇండస్ట్రీలోకి ఢీ కంటెస్టెంట్ ద్వారా వచ్చానని వివరించింది. 2017లో కొరియోగ్రాఫర్‌గా పని ప్రారంభించానని తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి పిలుపు వచ్చిందని, ఆయన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేయడానికి జాయిన్ అయ్యానని పేర్కొంది.

 

ఈ క్రమంలో ముంబయి ఓ సాంగ్ షూటింగ్ కోసం టూర్ వెళ్లామని, తనతోపాటు మరో ఇద్దరు మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు కూడా వచ్చారని వివరించింది. అయితే.. ఆ టూర్‌కు తన తల్లికి టికెట్ బుక్ కాలేదని చెప్పి.. తనను మాత్రమే తీసుకెళ్లారని తెలిపింది. ముంబయిలో హోటల్‌లో దిగానని, ఆ తర్వాత తనను రూంకు పిలిపించాడని పేర్కొంది. ఆ రూంలో తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు వివరించింది. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనకు అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, తాను మిన్నకుండిపోయానని, ఆ తర్వాత కొన్ని పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశానని తెలిపింది.

 

వ్యానిటీ వ్యాన్‌లోకి పిలిపించుకుని తనపై అసభ్యంగా ప్రవర్తించేవాడని, తాను అభ్యంతరపెడితే తీవ్రంగా కొట్టేవాడని, బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను అవాయిడ్ చేస్తూ వెళ్లినకొద్దీ ఏకంగా తన ఇంటికి రావడమే మొదలు పెట్టాడని తెలిపింది. బయటికి రమ్మంటే.. రాలేనని చెబితే ఇంటికి వచ్చి మరీ కొట్టేవాడని పేర్కొంది. తన స్కూటీని కూడా ధ్వంసం చేశాడని వివరించింది.

 

నార్సింగ్ పీఎస్‌లో కేసు ఉండగా.. బాధితురాలు తన స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉన్నది. అదే విధంగా సాక్ష్యాధారాలు కూడా సమర్పించాలని పోలీసులు పేర్కొన్నారు. రేపు వినాయక నిమజ్జనం కావడంతో పోలీసులు బిజీగా ఉండే అవకాశం ఉన్నది. ఎల్లుండి బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *