వేసవి ప్రారంభంలోనే హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోవడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. దీంతో శివారు ప్రాంతాల నుంచి మొదలుకొని ఐటీ కారిడార్ వరకు ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. మంజీరా, కృష్ణా జలాల సరఫరాలో అంతరాయం కలగడం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.
జలమండలి వాటర్ ట్యాంకర్ల కోసం బుకింగ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక ట్యాంకర్ బుక్ చేస్తే అది ఇంటికి చేరడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ధరలను విపరీతంగా పెంచేసి, సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో కంటే రెట్టింపు ధర చెల్లించినా సకాలంలో నీరు అందడం లేదని నగరవాసులు వాపోతున్నారు.
అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతిరోజూ నీటి కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు ట్యాంకర్ల సంఖ్యను పెంచి, సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. వర్షాలు పడి భూగర్భ జలాలు పుంజుకునే వరకు ఈ నీటి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.