తేది:22-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మెదక్ జిల్లాలో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు తెలిపారు. పిల్లల బాల్యం బడిలోనే ఉండాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమం అమలు ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలలను బాల కార్మికత్వం నుంచి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా, 12 మంది బాలలను సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. బాల కార్మికత్వానికి సంబంధించి జిల్లాలో మొత్తం 41 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, బాల కార్మికత్వంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.