ఆఖరి శ్వాసవరకూ ప్రజల కోసం పనిచేస్తానంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన వరమహిళల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నాకు భయం తెలియదు.. మీరంతా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘ప్రస్తుతం నేను కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాదు.. ఎన్డీయేకు అండగా నిలబడ్డ వ్యక్తిని కూడా. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటాం. అందులో ఎలాంటి సందేహం లేదు. పొట్టి శ్రీరాములు బలిదానం వల్లే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. డొక్కా సీతమ్మ సేవలను మనమంతా నిత్యం స్మరించుకోవాలి. ఆమె పేరుతో కూడా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలి. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తాను.
పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలి అని నిత్యం ఆలోచన చేస్తున్నా. పిఠాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి చూపిస్తా. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే నన్ను ఊరేగించండి’ అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.
‘కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ గురించి అధికారులతో మాట్లాడాను. ఈ మిషన్ కు కేంద్రప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తాయి. రాష్ట్ర వాటా ఇస్తే చాలు.. కేంద్రం నుంచి పూర్తిగా నిధులు వస్తాయి. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ పనులను గత పాలకులు పట్టించుకోలేదు.
మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో నా కోసం పనిచేశారు. ఏమిచ్చి జనసైనికుల రుణం తీర్చుకోగలను. నేను అనుకున్న ఆశయం కోసం మీరంతా చేతులు కలిపినందుకు ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా తక్కువే. అరాచక పాలన, దాష్టీకాలను ఎదురొడ్డి మరీ నిలబడ్డారు. మీరంతా జనసేనకు బలం ఇవ్వడం కాదు.. ఐదుకోట్ల మంది ప్రజలకు బలాన్ని ఇచ్చారు. జనసేన నేతలు లేని ఊరుంటుందేమో నాకు తెలియదు గానీ, జనసైనికులు, వీరమహిళలు లేని ఊరుండదు’ అంటూ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ లుగా ప్రకటించాలని అందులో కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను విప్ లుగా నియమించాలంటూ పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్న విషయం తెలిసిందే