న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ శరద్ బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్లపాటు న్యాయమూర్తిగా సేవలందించిన బాబ్డే.. 2019 నవంబర్లో 47వ సీజేఐగా నియమితులయ్యారు. ఆయన అనంతరం 48వ సీజేఐగా నియమితులు కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జస్టిస్ బాబ్డేకు వీడ్కోలు చెప్తూ జరిగిన సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లో ఆయన మాట్లాడుతూ, ”గౌరవనీయులైన నా సహచరులు మాత్రమే కాకుండా బార్ నుంచి, సంబంధిత ఇతరులందరి నుంచి న్యాయ సాధన లక్ష్యం కోసం గొప్ప చిత్తశుద్ధి, సత్ప్రవర్తన, అసాధారణమైన సమష్టి సహకారం అందడంతో, నేను ఈ న్యాయస్థానం నుంచి చాలా సంతోషంగా, సౌహార్దంతో, అద్భుతమైన వాదనల అత్యంత మధుర జ్ఞాపకాలతో సెలవు తీసుకుంటున్నానని మాత్రమే నేను చెప్పగలను” అని అన్నారు.