కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సాగర్‌లో చాలా మంచి పేరుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సాగర్‌లో చాలా మంచి పేరుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన్ని విమర్శిస్తే స్థానికులు ఊరుకోరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిని గ్రహించే తాము ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ, విరుచుకుపడ్డామని వెల్లడించారు. నాగార్జున సాగర్‌లో తమ అభ్యర్థే విజయం సాధిస్తారని, 20 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వల్లే దేశమే ఇబ్బందుల్లో పడిందని, తెలంగాణలో మాత్రం కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో ఆలోచించాలని ఆయన కోరారు. వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, ఒక్కో రాష్ట్రానికి, ఒక్కో రేటు ఎలా పెడతారని ప్రశ్నించారు. దేశంలో ఉద్యోగుల వేతనాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణాయేనని, అయినా పీఆర్సీ మీద గగ్గోలు పెడుతున్నారని తలసాని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *