రెండు వారాల్లోగా లొంగిపొండి..! తరుణ్ తేజ్‌పాల్‌కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

తహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. 2013 నాటి అత్యాచారం కేసులో తనకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షపై అప్పీల్ విచారించే వరకు లొంగిపోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ఏకసభ్య ధర్మాసనం తేజ్‌పాల్‌ను రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తేజ్‌పాల్ లొంగిపోయినట్లు ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేస్తేనే ఆయన అప్పీల్‌పై విచారణను సెప్టెంబర్ 22న చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2013లో గోవాలోని ఒక హోటల్ లిఫ్ట్‌లో జూనియర్ సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తేజ్‌పాల్‌ను 2021లో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబడుతూ బాంబే హైకోర్టు (గోవా బెంచ్) ఆయనను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఈ తీర్పుపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… అప్పీల్ విచారణకు రావాలంటే ముందుగా నిందితుడు లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.