మార్పులు చేర్పులతో ఇంటర్నల్ వార్..

పవర్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. అయితే ఆ స్ట్రాటజీస్ వర్కవుట్ చేసే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. సిట్టింగుల మార్పు అసలుకే ఎసరు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. మొత్తానికి ఛేంజ్ ఓవర్ పాలిటిక్స్ వైసీపీకి పెద్ద తలనొప్పిగానే మారుతున్నాయి.

 

నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం, అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో వైసీపీలో ఉన్న గ్రూపులు, అసంతృప్తులన్నీ ఒక్కొక్కటీ రోడ్డున పడుతున్నాయి. కొత్త సమన్వయకర్తల నియామకం పార్టీలో పెద్ద సమరానికి దారితీస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సీటు కోల్పోయిన నేతల నుంచి తిరుగుబాటు మొదలైంది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిందే అని నెల్లూరు ఎంపీ అభ్యర్థి అంటుండగా.. ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ సీటు విషయంలో సిట్టింగ్‌లకు టికెట్ వస్తుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది.

 

ఒకవైపు అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అంటూనే మరోవైపు..నా సీటు నాదేనంటూ పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను సర్దుబాటు చేయడమెలా అని అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. అందుకే మార్పులు, చేర్పుల ప్రక్రియకు తాత్కాలికంగా విరామం ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు.

 

ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ కోటలు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్‌ చేసిన వైసీపీకి ఇప్పుడు అక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు.. మేకపాటి, ఆనం, కోటంరెడ్డిలు పార్టీని వదిలిపోయారు. ఇక ఉన్న వారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైసీపీ నేతలే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయ కర్తల్లో ఒకరు చివరి వరకూ ఉంటారా మధ్యలోనే ఝలక్‌ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ సయన్వయకర్తగా.. నెల్లూరు ఎంపీని నియమించారు.

 

దీంతో అధికారపక్షానికి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కరవయ్యారు. ఇంతకాలం పార్టీకి ఆర్థికంగా అండదండలందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి అయితే ఒప్పించారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, ఇప్పుడు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడుచోట్ల ప్రస్తుతమున్న సిటింగ్‌ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను మార్చాలని పట్టుబడుతున్నారంట. వారినే పోటీ చేయిస్తే.. తాను పోటీ చేయడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన అధినాయకత్వానికి పంపారని అంటున్నారు.

 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఏడు స్థానాల్లో మార్పులు చేర్పులకు సీఎం జగన్‌ నిర్ణయించారు. సిట్టింగ్‌లకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు రగిలిపోతున్నారంట. మర్యాదలకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో పంతాలు, పట్టింపులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే.. ఆ క్రమంలో తూర్పులోని ఆ ఏడు స్థానాల్లో వైసీపీ భవితవ్యంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లా పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్‌ను ఈసారి మరోచోటికి మార్చాలని నిర్ణయించింది అధిష్ఠానం.

 

ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వైసీపీ సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు తాజాగా సమావేశమయ్యారు. పెడన నుంచి జోగిని మారిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారట. ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక మైలవరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్‌ అక్కడ గత కొంతకాలం తెరవెనుక రాజకీయం చేస్తూ వస్తున్నారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది.

 

పార్టీ అధిష్ఠానం, సీఎంఓ జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి. అప్పటికి సద్దుమణిగినా మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదంటున్నారు. ఇప్పుడు సమన్వయకర్తల మార్పుల నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచినా ఎమ్మెల్యే వసంత అందుబాటులోకి రావడం లేదని చర్చ జరుగుతోంది.

 

గోదావరి జిల్లా జగ్గంపేటలో సిటింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహంను సమన్వయకర్తగా నియమిస్తున్నారంట.. ఇప్పటికే వారిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.. ఇప్పుడు టికెట్‌ మారే సంకేతాలు వచ్చినా.. చంటిబాబు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడడంలేదు. తన కేడర్‌ మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుంది. లేకపోతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా వార్నింగ్‌ ఇస్తున్నారంట చంటిబాబు. ఇదే పరిస్థితి పి.గన్నవరం, గుమ్మనూరు, గురజాల, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, పొన్నూరు, గిద్దలూరు, అద్దంకి, కొండేపి, కనిగిరి నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తోంది.

 

అలాగే రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం రూరల్‌కు మార్చారు. రామచంద్రపురం టికెట్‌ తనకు దక్కకపోవడానికి అక్కడున్న ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కారణమని ఆగ్రహంతో ఉన్న మంత్రి వేణు.. భవిష్యత్తు కార్యాచరణపై తన కార్యకర్తలతో మంతనాల్లో మునిగి తేలుతున్నారంట. మొత్తానికి జగన్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి పెద్ద గండంగా మారే పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *