హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ప్రధాన నిందితురాలు, పనిమనిషి అయిన కల్పన తన ముఠాతో కలిసి దేశం దాటి నేపాల్కు పారిపోయి ఉండవచ్చని మొదట భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం వారు ఇంకా భారత్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న ప్రత్యేక బృందాలు, వారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో తలదాచుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నాయి.
ఈ కేసును ఛేదించేందుకు హైదరాబాద్ పోలీసులు మొత్తం 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ప్రయాణించినట్లు గుర్తించారు. నిందితురాలు కల్పన గతంలో లక్నోలో పనిచేసిన చరిత్ర ఉండటంతో, ఒక బృందం అక్కడికి వెళ్లి విచారణ జరుపుతోంది. అలాగే ఢిల్లీ, భోపాల్, గోరఖ్పూర్ మరియు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నిందితులు తనూజ చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు ఇంట్లోని భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును కూడా దోచుకెళ్లారు. కల్పన గత ఒక ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తోందని, యజమాని లేని సమయం చూసి తన ముఠా సభ్యులను వెనుక ద్వారం ద్వారా లోపలికి రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.