ఏపీలో కరోనాపై జగన్ సమీక్ష-అధికారులకు కీలక ఆదేశాలు..

ఏపీలో కోవిడ్‌ కొత్త రకం వ్యాప్తిపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో తాజా పరిస్ధితిపై ఆయనకు వివరాలు అందజేశారు. వీటిని పరిశీలించిన అనంతరం సీఎం జగన్ వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కొత్తరకం వైరస్ జేఎన్1 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రతలపై దృష్టిసారించాలని ఆదేశాలు ఇచ్చారు.

 

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ అధికారులతో తాజా పరిస్ధితిని సమీక్షించారు. జేఎన్‌-1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ఆయనకు వివరించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈ కోవిడ్‌ వైరస్ సోకినవారు రికవరీ అవుతున్నారని అధికారులు వెల్లడించారు.ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారు కోలుకుంటున్నారని సీఎం జగన్ కు తెలిపారు.

 

అలాగే ఈ కోవిడ్ ఉపరకానికి డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని అధికారులు తేల్చారు. అయితే జేఎన్‌-1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరణ ఇచ్చారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు.

 

రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల కోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నట్లు అధికారులు సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని వెల్లడించారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి-టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశామన్నారు. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

 

అధికారుల వివరణపై స్పందించిన సీఎం జగన్.. ఈ వేరియంట్‌ పై ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని, కాబట్టి ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలన్నారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలన్నారు. కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *