కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం దేశంలో కొత్తగా మూడు నేర చట్టాలను తీసుకురాబోతోంది. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లులను లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు లోక్ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.
బ్రిటిష్ పాలకుల హయాం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ(భారతీయ శిక్షాస్మృతి), సీఆర్పీసీ(నేర శిక్షాస్మృతి), ఎవిడెన్స్ యాక్ట్ (సాక్ష్యాధార చట్టం) స్థానంలో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. అందుకే ఈ కొత్త నేర శిక్షాస్మృతి బిల్లులును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేరుతో ఈ ఏడాది ఆగస్టులోనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ వీటిపై అభ్యంతరాలు రావడంతో ఆ సమయంలో వెనక్కు తీసుకుంది. మళ్లీ తాజాగా శీతాకాల సమావేశాల్లో వీటిని లోక్ సభలో ప్రవేశపెట్టింది.
కొత్త చట్టాల ప్రకారం మూకదాడికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించబడుతుంది. అలాగే బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చిన దేశ ద్రోహ చట్టం తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
కొత్త నేరచట్టాలు పోలీసుల బాధ్యతని, జవాబుదారీతనాన్ని మరింత పెంచుతాయని అమిత్ షా అన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే.. ఆ వ్యక్తి వివరాలు ప్రతీ పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా నమోదు చేయబడాలని, ఆ రికార్డులను నిర్వహించే బాధ్యత పోలీస్ ఆఫీసర్లదే అని ఆయన అన్నారు.
మనుషుల అక్రమ రవాణా నేరాలలో కొత్త చట్టాలు లింగ తటస్థంగా మార్చబడ్దాయి. 18ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం జరిగితే.. పోక్సో చట్టానికి సమానమైన కొత్త చట్టాల నిబంధనలు ఆటోమెటిక్గా వర్తిస్తాయని అమిత్ షా అన్నారు.
అలాగే ఉగ్రవాదానికి ఈ కొత్త చట్టాలలో స్పష్టమైన నిర్వచనం ఉంటుంది. ఎవరైనా యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని గాయపరిచినప్పుడు.. ఆ వాహనం నడిపిన వ్యక్తి స్వయంగా గాయపడిన మనిషిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇలాంటి సందర్భంలో యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి తక్కువ శిక్ష విధించబడుతుంది.
ఏదైనా కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేస్తే.. అతడిని కోర్టులో ఏడు రోజులలో విచారణ చేయాలి. లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్ఠంగా 120 రోజులలో అతని కేసు విచారణ మొదలుపెట్టాలి.
ఈ కొత్త క్రిమినల్ బిల్లులు త్వరలోనే రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు.