ఏపీ రాజధానిగా మావిగన్.. జగన్ సరికొత్త ప్లాన్-బీ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి ఒక భారీ రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ మూడు నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతానికి ‘మావిగన్’ (MAVIGUN) అనే సరికొత్త పేరును జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

రాష్ట్ర రాజధానిపై కొనసాగుతున్న సందిగ్ధతకు పరిష్కారంగా జగన్ ఈ ప్లాన్-బీని ప్రవేశపెట్టారు. మచిలీపట్నంలోని మొదటి రెండు అక్షరాలు (MA), విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు (VI), గుంటూరులోని మొదటి మూడు అక్షరాలను (GUN) కలిపి ‘మావిగన్’ అనే పేరును రూపొందించారు. మచిలీపట్నం నుండి విజయవాడ వరకు ఉన్న 70 కిలోమీటర్లు, విజయవాడ నుండి గుంటూరు వరకు ఉన్న 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిని పూర్తిస్థాయి రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు.

 

తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రగతి..

 

రూ.2 లక్షల కోట్లతో కొత్తగా నగరాన్ని నిర్మించడం కంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడ్డారు. కేవలం 10 శాతం పెట్టుబడి అంటే సుమారు రూ.20 వేల కోట్లతోనే ఈ 110 కిలోమీటర్ల కారిడార్‌ను ప్రపంచస్థాయి గ్రోత్ ఇంజిన్‌గా మార్చవచ్చని పేర్కొన్నారు. అప్పులు చేసి భారీ కట్టడాలు నిర్మించే కంటే ఉన్న వనరులను సమర్థంగా వాడుకోవడం వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన వివరించారు.

 

కనెక్టివిటీనే అసలైన బలం..

 

ఈ ప్రాంతానికి ఉన్న సహజ సిద్ధమైన వనరులు, రవాణా సౌకర్యాలను జగన్ తన ప్రతిపాదనలో ప్రధానంగా ప్రస్తావించారు. మచిలీపట్నంలో పోర్టు సౌకర్యం ఉండటం, విజయవాడ రైల్వే జంక్షన్ కావడం, గన్నవరం విమానాశ్రయం అందుబాటులో ఉండటం వల్ల ఈ మూడు నగరాల అనుసంధానం పారిశ్రామికంగా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రహదారుల విస్తరణ, పట్టణాల మధ్య సమన్వయం ద్వారా అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఈ ‘మావిగన్’ ప్రాంతానికి ఉందని స్పష్టం చేశారు.

 

విశాలమైన కారిడార్ రూపంలో రాజధాని..

 

అమరావతిపై ప్రస్తుతం సాగుతున్న చర్చల నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉంచడమే తన ఉద్దేశమని జగన్ తెలిపారు. కేవలం ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా విశాలమైన కారిడార్ రూపంలో రాజధాని ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ‘మావిగన్’ అనే పేరు ఒక ప్రతిపాదన మాత్రమేనని, ప్రజలు లేదా నిపుణులు మెరుగైన పేర్లు సూచిస్తే వాటిని కూడా పరిశీలించవచ్చని ఆయన ఉదారత చాటారు. కేవలం భవనాల నిర్మాణం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే అభివృద్ధి జరగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *