ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..

గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చవచ్చని చెప్పారు.

 

గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్థులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. సభల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదికల వద్ద తాగునీరు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.

 

గ్రామ సభల అజెండాను స్పష్టంగా ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మహిళా శక్తి వంటి పథకాలపై గ్రామ సభల్లో విస్తృతంగా చర్చించాలన్నారు. ప్రతి గ్రామ సభలో విధిగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించాలని అధికారులకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *