ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏ మాత్రం మారలేదా? మూడు రాజధానులకు ఆ పార్టీ కట్టుబడి ఉందా? రేపో మాపో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత రానుందా? ఇలాంటి సమయంలో రాజధాని రైతుల్లో అయోమయం సృష్టించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారా? ఓ వైపు మండలి ప్రతపక్ష నేత బొత్స, మరోవైపు ధర్మాన ప్రసాద్ మాటలు మిగతా ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే అంటున్నారు కూటమి నేతలు.
ఏపీ రాజధాని అమరావతిపై మారని జగన్ వైఖరి
మరో నాలుగైదు రోజుల్లో ఏపీ రాజధాని అమరావతిగా కేంద్రం నుంచి చట్టబద్దత రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ఈ వారంలో దానికి ఆమోదముద్ర పడడం ఖాయమని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఏపీలో ఎవరొచ్చినా రాజధానిని ఒక్క అడుగు కదపలేదని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటి నేతలు అసెంబ్లీ వేదికగా తేల్చేశారు.
ప్రత్యేక సమావేశాలకు ముందురోజు వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని, కాకపోతే అక్కడి రైతులకు న్యాయం చేయాలని తాము కోరుకుంటున్నామని అక్కడి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా మూలపేటలో వైసీపీ ఏర్పాటు చేసిన సభలో మండలి ప్రతిపక్ష నేత బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని తేల్చేశారు. రాజధానిపై నిర్ణయం ఆయా రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుందన్నారు.
మరోసారి విషం చిమ్మిన ఆ పార్టీ నేతలు, రైతుల్లో కొత్త టెన్షన్ మొదలు
అటు వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూడా ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పులు తెచ్చి రాజధానిని అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజధాని కారణంగా మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రభుత్వం తీర్మానం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆరు దశాబ్దాలపాటు హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే అక్కడ నుంచి తరిమేశారన్నారు. రేపటి రోజున అమరావతి వాళ్లు తరిమేస్తే ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు.
శాశ్వత రాజధాని అనేది రాజ్యాంగంలో లేదన్నారు. ఈ లెక్కన మా ప్రభుత్వం వస్తే మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈ లెక్కన చట్టసభలపై వైసీపీ గౌరవం లేదని తేలిపోయిందని కూటమి నేతలు అంటున్నారు. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేసిందని, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాని తర్వాత పార్లమెంటు ఉభయసభల్లో దాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేయనున్నారు.
అన్నట్లు.. వైసీపీ తమ మేనిఫెస్టోలో అమరావతి రాజధాని అని పెట్టారు. అమరావతిపై జగన్ మాటలను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ. జగన్-బొత్స-ధర్మాన మాటల్లో పొంతన లేదన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెబితే బాగుండేదని అంటున్నారు. ఆ లెక్కన మా స్టాండ్ విధ్వంసం.. వినాశనం అని తేల్చేసింది వైసీపీ. మరోవైపు వైసీపీ నేతల మాటలపై రాజధాని రైతులు తలో విధంగా మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి చేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఈ ప్లాన్ చేసిందని అంటున్నారు.