తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికార డీఎంకే కూటమిని ఎదుర్కోవడానికి బీజేపీ – విజయ్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగింది. విజయ్ పార్టీకి బీజేపీ 80 సీట్లు మరియు అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసిందని, ఈ పొత్తు కుదిర్చేందుకు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఈ ప్రచారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు. ఒక తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విజయ్తో పొత్తు విషయమై తాను ఎలాంటి చర్చలు జరపలేదని కుండబద్ధలు కొట్టారు. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తనకు తెలియదని, తాను విజయ్ని కలిసి దాదాపు పాతికేళ్లు అవుతోందని పవన్ కళ్యాణ్ వివరించారు. దీంతో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న మధ్యవర్తిత్వ పుకార్లకు చెక్ పడింది.
మరోవైపు టీవీకే (TVK) పార్టీ కూడా ఈ పొత్తు వార్తలను కొట్టిపారేసింది. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని విజయ్ ఇప్పటికే ప్రకటించారని, బీజేపీతో పొత్తు అనేది కేవలం సృష్టించబడిన ప్రచారం మాత్రమేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో తమిళనాడు ఎన్నికల బరిలో విజయ్ మరియు బీజేపీల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ అవగాహన లేదని తేలిపోయింది.