అజ్ఞాత దాత భారీ విరాళం: ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో అలమటిస్తున్న చిన్నారులను ఆదుకునేందుకు దుబాయ్ ప్రభుత్వం చేపట్టిన ‘ఎడ్జ్ ఆఫ్ లైఫ్’ (Edge of Life) కార్యక్రమానికి ఒక అజ్ఞాత దాత భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా 35 మిలియన్ దిర్హామ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.87 కోట్లు) విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో 50 లక్షల మంది పిల్లలను ఆకలి నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ఈ విరాళం పెద్ద ఊతమిచ్చింది.
దీర్ఘకాలిక పరిష్కారం దిశగా అడుగులు: దుబాయ్ పాలకుడు షైక్ మహమూద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్ ప్రారంభించిన ఈ కార్యక్రమం కేవలం తాత్కాలికంగా ఆహారం అందించడమే కాకుండా, చిన్నారుల్లో పోషకాహార లోపానికి దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి సారించింది. మొత్తం ఒక బిలియన్ దిర్హామ్ల (సుమారు రూ.2,400 కోట్లు) నిధుల సేకరణే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ (UNICEF) భాగస్వామ్యంతో ఈ నిధులను క్షేత్రస్థాయిలో అత్యంత బలహీన వర్గాలకు చెందిన పిల్లల ఆరోగ్యం మరియు చికిత్స కోసం వినియోగించనున్నారు.
11.5 సంఖ్య వెనుక ఉన్న పరమార్థం: ఈ ఇనీషియేటివ్లో ‘11.5’ అనే సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం.. 6 నెలల నుండి 5 ఏళ్ల వయస్సు గల పిల్లల మోచేతి చుట్టుకొలత (MUAC) 11.5 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే, వారు తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్నట్లు నిర్ధారిస్తారు. అటువంటి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి, వారికి తక్షణమే ప్రాణరక్షక చికిత్స మరియు పోషకాహారాన్ని అందించడమే ఈ ‘ఎడ్జ్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.