వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా స్పందించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయిన జగన్కు, అధికారం కోల్పోయాక పాదయాత్ర గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ శకం పూర్తిగా ముగిసిందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ మళ్లీ పాదయాత్ర అనే కొత్త డ్రామాకు తెరతీశారని ఆయన విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో పర్యటించిన మంత్రి, రూ. 10.92 కోట్ల వ్యయంతో కాజ మేజర్ డ్రైన్ అవుట్ఫాల్స్ స్లూయిస్ పనులకు శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గోదావరి వరదల వల్ల వేలాది ఎకరాల పంట నష్టపోయినా, కనీసం డ్రైన్ల మరమ్మతులు కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కష్టాలను గుర్తించి, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పనులు ప్రారంభించామని నిమ్మల స్పష్టం చేశారు.
జగన్ కేవలం పాదయాత్రలకే పరిమితమైతే, తాము అభివృద్ధి పనులతో ప్రజలకు జవాబు చెబుతామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. యలమంచిలి నుంచి బాడవ వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించిన ఆయన, రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముంపు బాధల నుంచి రైతులను విముక్తం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.