భారత రూపాయి విలువ పతనం అవుతూ, డాలర్తో పోలిస్తే 91 మార్క్ను దాటి కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం వంటి కారణాలతో రూపాయి విలువ ఈ రోజు ప్రారంభంలో 36 పైసలు తగ్గి 91.14 స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఇది 100 స్థాయికి చేరే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
రూపాయి పతనం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దేశీయ సూచీలు మరోసారి భారీ నష్టాల్లోకి జారాయి. సెన్సెక్స్ 534 పాయింట్లు తగ్గి 84,680 వద్ద ముగియగా, నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయి 25,860 వద్ద క్లోజ్ అయింది. రెండు వారాలుగా విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం మార్కెట్పై ఒత్తిడిని పెంచాయి.
సెన్సెక్స్లోని 30 షేర్లలో 23 నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో షేర్లు దాదాపు 5 శాతం పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో కూడా నష్టాలే ఆధిపత్యం చెలాయించాయి; ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 1.5% నుంచి 2.24% వరకు నష్టాలను చవిచూశాయి