హైదరాబాద్‌లో విషాదం: పెళ్లై 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య – నిత్యం గొడవలే కారణమా?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో పెళ్లైన మూడు నెలలకే చందన జ్యోతి (ప్రొద్దుటూరుకు చెందిన యువతి) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుని కలకలం రేపింది. కొత్త జీవితంపై కోటి ఆశలతో కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ యువతి, పెళ్లైన నాటి నుంచి భర్తతో తరచుగా జరుగుతున్న గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్, చందన జ్యోతి వివాహం మూడు నెలల క్రితం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి నిత్యం గొడవలు జరుగుతుండటంతో శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త యశ్వంత్ తలుపులు బద్దలు కొట్టి చూడగా, అపస్మారక స్థితిలో కనిపించింది.

వెంటనే యశ్వంత్ 108కు కాల్ చేసి, అంబులెన్స్‌లో చందనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అయితే, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె ఇలా అర్థాంతరంగా మరణించడంపై చందన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *