పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైతే, మహిళలు వంటగదిలో వాడే ఆయుధాలతో (కిచెన్ టూల్స్) సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. SIR అనంతరం ఓట్లు తొలగింపునకు గురైతే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు, ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి బెదిరిస్తారని ఆమె ఆరోపించారు.
మమతా బెనర్జీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు సందేశం ఇస్తూ, ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల ఓట్లను లాక్కుంటారని హెచ్చరించారు. జాబితాలో తమ పేరు లేకపోతే, వారి వంటగదిలో వాడే వస్తువులే వారి బలమని పేర్కొన్నారు. మహిళలు ముందుండి పోరాడతారని ఆమె అన్నారు. తాను లౌకికవాదాన్ని నమ్ముతానని స్పష్టం చేస్తూ, మహిళలు బలవంతులా, బీజేపీ బలమైన పార్టీయా చూడాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ ప్రజలను విభజించేందుకు ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బులు పంచుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను కూడా దింపుతోందని ఆమె ఆరోపించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు ఎన్నడూ ప్రజలను విభజించేలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. భారత పౌరులుగా స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.