హైదరాబాద్లోని అమీర్పేట, మైత్రీవనంలో ఉన్న ‘శివమ్ టెక్నాలజీస్’ అనే కోచింగ్ సెంటర్లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినా, అదృష్టవశాత్తూ విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రాథమిక అంచనా ప్రకారం, కోచింగ్ సెంటర్లోని బ్యాటరీలు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటలు మరియు దట్టమైన పొగలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి సెంటర్లోని విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
వందలాది కోచింగ్ సెంటర్లకు నిలయమైన అమీర్పేట ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండే ఇలాంటి సంస్థల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.