ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఈ సమావేశం ఏకంగా 88 నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. వాస్తవానికి, ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) నియామకంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. నిబంధనల ప్రకారం, సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ విభాగాల్లో కీలక నియామకాలపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి (ఈ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు) కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ భేటీలో కేవలం సీఐసీ నియామకం గురించే కాకుండా, మరో 8 మంది సమాచార కమిషనర్లు, ఒక విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నియామకాలన్నింటికీ రాహుల్ గాంధీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా కూడా సమర్పించినట్లు తెలిసింది. గతంలో ఇలాంటి సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు అభ్యంతరాలు తెలపడం సాధారణమే అయినా, ఈసారి భేటీ ఇంత సుదీర్ఘంగా జరగడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్లో సీఐసీతో సహా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న హీరాలాల్ సమారియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. ఈ కమిషన్లో దాదాపు 30,838 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన సీఐసీ మరియు ఇతర కీలక పోస్టుల భర్తీపై సుదీర్ఘ చర్చ జరగడం, ప్రతిపక్ష నేత తన అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వడం ఈ నియామకాల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.