కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్ఫాస్ట్ చర్చలపై వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య గ్రూప్లు ఉన్నట్లు మీడియాలో వస్తున్న ప్రచారం, దాని ద్వారా ఏర్పడిన ఒత్తిడి కారణంగానే తాము కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు.
కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై, అలాగే రెండు వర్గాలు ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈరోజు స్పందించారు. సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్ లేదా డీకే శివకుమార్ గ్రూప్ అంటూ ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.
మీడియా మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గ్రూప్లు ఉన్నట్లు ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ చర్చల్లో కేవలం పార్టీ గురించి మాత్రమే మాట్లాడుకున్నామని, మీడియా ఒత్తిడి వల్లే తాము ఇటీవల కలిసి భోజనం చేశామని తెలిపారు. దీని గురించి మీడియా అనవసరంగా దృష్టి పెట్టకపోవడం మంచిదని ఆయన కోరారు.