ప్రముఖ క్విజ్ ఆధారిత రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) తదుపరి ప్రత్యేక ఎపిసోడ్లో భారత మహిళా క్రికెట్ జట్టు సందడి చేయనుంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించిన జట్టు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోస్ట్ అమితాబ్ బచ్చన్తో ముచ్చటించనున్నారు. క్రీడా స్ఫూర్తిని, మహిళా శక్తిని సెలబ్రేట్ చేసే ఈ ఎపిసోడ్ క్రికెట్ మరియు క్విజ్ను ఒకే వేదికపైకి తీసుకురానుంది.
ఈ ప్రత్యేక ఎపిసోడ్లో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు హర్లీన్ కౌర్ డియోల్, రిచా ఘోష్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రాణా మరియు జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. ఆటగాళ్లు తమ మైదానంలోని అనుభవాలు, జట్టు సభ్యుల మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణం, మరియు ప్రపంచకప్ విజయ పయనంలోని ముఖ్య ఘట్టాల గురించి అమితాభ్తో సరదాగా పంచుకున్నారు. అయితే, జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ఈ ఎపిసోడ్కు హాజరుకాలేదు.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి. ఈ విజయాన్ని మరింతగా సెలబ్రేట్ చేయడంలో భాగంగా ఈ ఎపిసోడ్ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ లివ్లో ప్రసారం కానుంది.