తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వనపర్తిలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, తనను ఉద్దేశించి “పచ్చు వంకాయ, సచ్చు వంకాయ” అంటూ ఇంకొకసారి వాగితే పుచ్చె లేచిపోతుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇన్నాళ్లూ తాను నిరంజన్ రెడ్డి వయసుకు గౌరవించానని, లేకుంటే ఎప్పుడో విమర్శించేదానినని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా కవిత, నిరంజన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. లేకపోతే, ఆ అవినీతి కేసీఆర్ వద్దకు వెళ్లకుండా హరీశ్ రావు కాపాడారా? అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.
అయితే, నిరంజన్ రెడ్డి అవినీతి ఇంత వరకూ కేసీఆర్కు తెలియదనే అనుకుంటున్నానని కవిత అన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి నేతలను ఇప్పటికైనా పార్టీ పక్కన పెడితేనే మంచిదని, లేకపోతే పార్టీకే నష్టం అని బీఆర్ఎస్ నాయకత్వానికి ఆమె సూచన చేశారు.