తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై వస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టిగా బదులిచ్చారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం మరియు తులం బంగారం వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతున్నదానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల వడ్డీల రూపంలోనే ప్రతి ఏడాది ₹75,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ, మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు ₹10,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, తులం బంగారం పథకానికి కూడా అదనంగా మరో ₹4,000 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఈ రెండు పథకాలకు కలిపి సుమారు ₹15,000 కోట్ల అదనపు ఖర్చును భరించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అనుకూలంగా లేకపోవడానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోందని జూపల్లి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుల కంటే పది రెట్లు అధికంగా కేసీఆర్ అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.