విద్యా సమస్యలపై మంత్రి నారా లోకేశ్ హామీ: ఫీజు బకాయిల చెల్లింపు, 4,300 అధ్యాపక పోస్టుల భర్తీ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై దృష్టి సారించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు మరియు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సుమారు రూ. 4,200 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను ఆర్థిక వెసులుబాటును బట్టి దశలవారీగా చెల్లిస్తామని మంత్రి తెలిపారు.

మంత్రి లోకేశ్ ఇచ్చిన కీలక హామీలలో విశ్వవిద్యాలయాల్లోని 4,300 అధ్యాపక పోస్టుల భర్తీ ఒకటి. న్యాయపరమైన చిక్కులను అధిగమించి, సాధ్యమైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, వచ్చే ఏడాదికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల (సెట్) షెడ్యూళ్లను ఈ ఏడాదే విడుదల చేసి, పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల బస్ పాస్‌ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు అపార్ ఐడీతో అనుసంధానం చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

రాష్ట్ర విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మంత్రి లోకేశ్ తేల్చిచెప్పారు. అయితే, విద్యాసంస్థల పనివేళలు ముగిశాక, రాజకీయేతర సమస్యలపై చర్చించుకోవడానికి విద్యార్థి సంఘాలకు ప్రత్యేక వేదిక కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు, జీవో నెం. 77 (పీజీ విద్య), జీవో నెం. 107, 108 (ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానం) లను రద్దు చేయాలని, డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లను రద్దు చేసి పాత ఆఫ్‌లైన్ విధానాన్ని కొనసాగించాలని వంటి కీలక డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *