ఏపీ రాజకీయాల్లోకి బొత్స కుమార్తె ఎంట్రీ..? వచ్చే ఎన్నికల్లో పోటీ..?

ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నేతలు తమ నెక్ట్స్ జనరేషన్లను రంగంలోకి దింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు ఆసక్తి చూపడంలేదు. వారికి బదులుగా కుమారుడు లేదా కుమార్తెలను పోటీకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు. కాబట్టి, రాబోయే ఎన్నికలు యువకుల మధ్య ప్రధాన పోటీ నెలకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ముఖ్యమంగా వైసీపీ సీనియర్ నేతలు ఈ బాటలో నడుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడంలేదు. వారిలో కొందరు ఇప్పటికే తమ వారసులను రంగంలోకి దింపగా, మరికొందరు త్వరలో వారసుల రాజకీయ రంగ ప్రవేశం కోసం తహతహలాడుతున్నారు.

 

మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పేర్ని కిట్టును పోటీకి దింపుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి చోటు కల్పించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీలోకి దింపుతున్నారు.

 

సీనియర్ నేతల ట్రెండ్

వైసీపీలో ముఖ్యనేతలు ఫాలో అవుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను రాజకీయాల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారని సమాచారం. బొత్స అనూష రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. బొత్స కుటుంబానికి చాలా కాలంగా చీపురుపల్లితో ఉన్న సంబంధాన్ని కొనసాగించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

 

రాజకీయాల్లోకి బొత్స అనూష

సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వయస్సు పైబడుతుండడంతో పాటు, ఆయన ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ కుటుంబం నుంచి మరొకరిని రాజకీయాల్లో తీసుకువచ్చేందుకు ఆయన నిర్ణయించినట్లు సమాచారం. చీపురుపల్లి నియోజకవర్గంలో తన తండ్రి సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో డాక్టర్ అనూష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు.

 

గత కొన్ని నెలలుగా అనూష గ్రౌండ్ లెవల్ కార్యకలాపాలు స్పీడప్ చేశారు. గ్రామాలను సందర్శించడం, మహిళలు, యువతతో మాట్లాడడం, స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించడం చేస్తున్నారు. వైద్యురాలిగా ఆమెకు ఇప్పటికే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో ఆమెపై భరోసా పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు.

 

హైకమాండ్ అభ్యంతరం లేకపోవచ్చు

బొత్స సత్యనారాయణ సీనియారిటీ మేరకు బొత్స అనూష అభ్యర్థిత్వానికి వైసీపీ హైకమాండ్ నుండి ఎలాంటి అడ్డు ఉండదని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. డాక్టర్ అనూష తన తండ్రి సత్యనారాయణ పర్యవేక్షణలో వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సంస్థాగత అనుభవాన్ని పెంచుకునేందుకు, స్థానిక కార్యకర్తలతో తరచూ మాట్లాడుతున్నారు. బొత్స అనూష రాకతో నియోజకవర్గంలో ముఖ్యంగా యువ ఓటర్లలో కొత్త ఎనర్జీ నింపుతారని కార్యకర్తలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *