తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, అల్వాల్, శామీర్పేట్, బంజారాహిల్స్, సనత్నగర్, ఎర్రగడ్డ సహా అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు ఈ ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. మరో గంట వ్యవధిలో ఉప్పల్, సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్, హైటెక్ సిటీ వంటి మరిన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ నగర పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలని, ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.