టాటా గ్రూప్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్ పునర్నియమితులయ్యారు. అక్టోబర్ 23తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన జీవితకాలం ట్రస్టీగా కొనసాగేందుకు ట్రస్ట్స్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల విషయంలో టాటా ట్రస్టీలు, మిస్త్రీ కుటుంబానికి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న కీలక సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. అయితే, ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు నిరాకరించింది.
వేణు శ్రీనివాసన్ జీవితకాలం కొనసాగేలా నిర్ణయం తీసుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి మిస్త్రీ కుటుంబానికి చెందిన మరో ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ పునర్నియామకంపై పడింది. మెహ్లీ మిస్త్రీ పదవీకాలం ఈ నెల అక్టోబర్ 28న ముగియనుంది. ఆయన కొనసాగింపు విషయంలో ట్రస్టీల మధ్య ఇప్పటికే అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. టాటా సన్స్ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల అంశంలో ట్రస్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్న నేపథ్యంలో, మెహ్లీ మిస్త్రీ నియామకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టాటా ట్రస్ట్స్కు దశాబ్దాల పాటు రతన్ టాటా ఛైర్మన్గా వ్యవహరించారు. ఆయన హయాంలో ట్రస్ట్స్కు, గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్కు మధ్య మంచి సమన్వయం ఉండేది. అయితే, రతన్ టాటా మరణానంతరం గత ఏడాది అక్టోబర్లో నోయల్ టాటా ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. నోయల్ చేసే ప్రతి పనిని ట్రస్టీలు తప్పుబడుతున్నారని సమాచారం. మెహ్లీ మిస్త్రీ సైతం కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ అంతర్గత భిన్నాభిప్రాయాల కారణంగా, ట్రస్టీల నియామకాలు ఇప్పుడు టాటా గ్రూప్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.