కేటీఆర్‌కు ఏసీబీ షాక్.. నోటీసులు జారీ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఈ నోటీసులు పంపించారు.

 

ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌ను విచారించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో, ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులో స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం కేటీఆర్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూకే, అమెరికాలో ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో, ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. తాను విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని అన్నారు. 48 గంటల క్రితం ఈడీ ఛార్జ్‌షీట్‌లో రేవంత్ పేరు వచ్చిందని, అందుకే ఆయన కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. నోటీసులపై ఏసీబీకి లిఖితపూర్వక సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *