చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి.. ఎన్నేళ్లు జైలు శిక్ష అంటే..?

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది.

 

జైలుకు గాలి జనార్దన్ రెడ్డి

 

అయితే, నాంపల్లి సీబీఐ కోర్టు గాలి జనార్దన్‌ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో దోషులను పోలీసు అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టులోనే వైద్యులు దోషులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి వీరిని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. 2009 నుంచి అంటే దాదాపు 15 ఏళ్లకు పై నుంచి సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం గాలి జనార్ధన్ తో పాటు మరో నలుగురిని దోషులగుగా.. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

 

ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్‌ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ ఒక్కొక్కరికీ ఏడేళ్ల పాటు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ(ఓఎంసీ)కి కోర్టు రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పుని వెలువరించింది.

 

ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా తేలడంతో ఆమె న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పన్నెండున్నర ఏళ్ల కింద కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని.. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కానని అన్నారు. ఆ రోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఓ రకమైన బాధను అనుభవించానని చెప్పారు. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం కలిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *