బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న. తెలంగాణా ప్రజలు బుద్ది చెప్పినా కేటీఆర్ తీరు మారలేదన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్కు దిక్కులేదని, అందుకే ఏపీ గురించి తరచు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. విజయవాడలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న.
పెట్టుబడులు విషయంలో తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తావా అంటూ రుసరుసలాడారు బుద్ధ. ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందన్నారు. ప్రపంచ దేశాలు ఆయన్ని చూసి ఏపీకి వస్తాయని గుర్తు చేవారు. చంద్రబాబును అరెస్టు చేస్తే 100 దేశాల్లో నిరసన చేశారని వివరించారు. ఇలాంటి నోటి దూలతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. తీరు మారకుంటే సిరిసిల్లలో గెలవరని హెచ్చరించారు.
చంద్రబాబు పాలనపై దేశ, విదేశాల్లో ఆయనంటూ ఒక ఇమేజ్ ఉందన్నారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఏదో మాట్లాడారని ఆయన గొప్పతనం తగ్గదన్నారు. అధినేత చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, ఒక్కసారి మీ నాన్నకు తెలుసు అని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే మాట్లాడరని గుర్తు చేశారు బుద్ధ వెంకన్న. టీడీపీ మద్దతుదారులు అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకున్నది కాదా అంటూ ప్రశ్నించారు. ఆపై వెకిలిగా మాట్లాడారని దుయ్యబట్టారు.
ఇలాంటి కార్యక్రమాలు పక్క రాష్ట్రంలో చేసుకోవాలని అన్నందుకే మీ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. మీ పార్టీ తుడిచి పెట్టుకు పోవడానికి ఆయన వెకిలిగా మాట్లాడమే కారణమన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ది చెప్పిన విషయం గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు.
జగన్ లాంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు, మాకు నీతులు చెబుతావా? సూటిగా ప్రశ్నించారు. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్కు దిక్కు లేదన్నారు. జగన్ తన వికృత చేష్టలతో అధినేతను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు బుద్దా వెంకన్న.
జగన్ జైలుకు వెళితే లక్ష కోట్లు దోచుకున్నారు కాబట్టి వెళ్లారని ప్రజలే చెప్పారని అన్నారు. అదేచంద్రబాబును జైలుకు పంపితే అన్యాయంగా కేసులు పెట్టారంటూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన విషయాన్ని వివరించారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. కేటీఆర్ ఇంట్లో అందరూ కోడ్ భాషలో మాట్లాడుకుంటారని అన్నారు.
ఢిల్లీ నుంచి లిక్కర్ బాటిళ్లను తెచ్చుకునేందుకు ప్రత్యేకంగా కోడ్ పెట్టుకున్నారని గుర్తు చేశారు. భారతదేశానికి చంద్రబాబు కటౌట్ ఒక్కటి చాలన్నారు. మీ రాష్ట్రంలో మీరు రాజకీయాలు చేసుకోవాలన్నారు. మీ దగ్గరున్న ఎమ్మెల్యేలు ఆనాడు ఖండించారు కాబట్టే గెలిచారన్నారు. లేకపోతే 39 సీట్లు వచ్చేవి కావన్నారు.
పక్కా కాంగ్రెస్ వాది కోమటిరెడ్డి సైతం చంద్రబాబు అరెస్ట్ను ఖండించారన్నారు. ఇంకోసారి చంద్రబాబును విమర్శిస్తే సిరిసిల్లలో మీరు గెలవరన్నారు. ఒకసారి మీరు పడ్డారని, లేవ లేని పరిస్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు ఓడినా ఎన్నిసార్లు గెలిచారో మీకు తెలీదా ? అంటూ ప్రశ్నించారు.