కర్త, కర్మ, క్రియ జగన్.. అంతా నాశనం చేశారు.. షర్మిళ సంచలన కామెంట్స్..

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోమారు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కు లేదని షర్మిళ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై షర్మిళ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.

 

షర్మిళ చేసిన ట్వీట్ ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కు కూడా లేనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరు వింటే వైఎస్సార్ గుర్తుకు వచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు? వైఎస్సార్ జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా? అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా? నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా? అంటూ షర్మిళ ప్రశ్నించారు.

 

వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ గురించి షర్మిళ లేవనెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని, కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో సీఎం చంద్రబాబు భాగస్వామి అయితే, కర్త, కర్మ,క్రియ జగన్ కారణమన్నారు.

 

అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం చెప్తున్నవి పచ్చి అబద్ధాలని, మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారని, ఎత్తు తగ్గించి 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారన్నారు. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని, 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే మహానేత వైఎస్సార్ నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ అనుకుంటే.. 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్‌గా మార్చుతున్నారన్నారు. నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారని ఆరోపించారు.

 

41.15 మీటర్ల ఎత్తుకి, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా ? కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు షర్మిళ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే, కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రాజెక్టు కొత్త డిపిఆర్ బయటపెట్టాలని, అఖిలపక్షాన్ని పిలిచి నిజానిజాలు చెప్పాలన్నారు. పునరావాస చర్యలకే రూ.30వేల కోట్లు దాటుతుంటే, తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించాలని షర్మిల ట్వీట్ ద్వారా కోరారు. మొత్తం మీద జగన్, వైసీపీని ఉద్దేశించి షర్మిళ సంచలన కామెంట్స్ చేయగా ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *