వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగు తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా ఇంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న రంగయ్య మృతి చెందారు. వివేకా కేసులో ఆయన ప్రత్యక్ష సాక్షి కూడా. రంగయ్య ఆరోగ్యం రీత్యా చనిపోయారా? లేక పక్కాగా స్కెచ్ వేసి చంపేశారా? అవే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.
రంగన్న మృతి వెనుక?
వివేకానందరెడ్డి కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రంగన్న. బుధవారం మధ్యాహ్నం పులివెందుల నుంచి రిమ్స్కు తరలించారు పోలీసులు. ప్రొఫెసర్ డాక్టర్ తనూజ్రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఓ బృందం వైద్యసేవలు అందించింది.
రంగన్న ఆసుపత్రికి వచ్చిన 30 నిమిషాల వ్యవధిలో ఆయన పరిస్థితి విషమించింది. చివరకు రంగన్న మృతి చెందినట్లు ఆర్ఎంఒ వై శ్రీనివాసులు వెల్లడించారు. రంగన్న మృతి విషయాన్ని పులివెందుల డిఎస్పి మురళీ నాయక్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులోని ప్రధాన సాక్షుల్లో రంగన్న కీలకమైన వ్యక్తి. ఆయన మృతి కేసుపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఈ కేసులో సీబీఐకి ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేశారాయన.
రంగన్న మృతిపై ఆయన భార్య నోరు విప్పింది. గత ఆగస్టు నుంచి మా ఆయనకు ఆరోగ్యం క్షీణించిందని తెలిపింది. పొలీసులు రిమ్స్లో వైద్యం అందించారని తెలిపింది. 2019-24 వరకు పోలీసులు రంగన్నను బాగా చూసుకున్నారని, తాను లేకపోయినా వైద్య సేవలు అందించారని తెలిపింది.
గత మూడు నెలలుగా పోలీసులు పట్టించుకోలేదని, ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మీ ఆవిడను తీసుకెళ్తుందని చెప్పేవారని చెప్పుకొచ్చారామె. రంగన్న భార్య మాటలు చూసినవాళ్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రంగన్నకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య కూలి పనులు చేస్తుండగా, కుమారులిద్దరూ హైదరాబాద్లో ఉంటున్నారు. వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిరంగన్న చనిపోవడం కేసులో కీలక మలుపుగా మారింది. వివేకా హత్య కేసులో రంగన్నతో కలిసి ఇప్పటివరకు నలుగురు సాక్షులు మృతి చెందారు.
ఎంతమంది చనిపోయారు?
కడప జిల్లాకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న వంతైంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో రంగయ్య ఉన్నాడు. దీంతో ఈ కేసులో ఆయన కీలకంగా మారాడు. సీబీఐకి ఆయన వాంగ్మూలం ఇస్తూ కీలక అంశాలు బయటపెట్టాడు. కీలక సాక్షిగా ఉన్న రంగయ్యకు గతంలో గన్మెన్లను కేటాయించింది సీబీఐ.
ఈ కేసులో కీలక సాక్షులు చనిపోతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. వివేక హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్గా ఉన్నాడు. పలుమార్లు రంగన్నను సీబీఐ ప్రశ్నించి, స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది. తొలుత రంగన్నను ఎవరూ పట్టించుకోలేదు. సీబీఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం తర్వాత సంచలనం సృష్టించింది. ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని తన స్టేట్మెంట్లో రంగన్ ప్రస్తావించిన విషయం తెల్సిందే. అయితే ఏ-1 నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారాడు.