కరోనా నియంత్రణ ప్రదేశాల్లో కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌తో కలిసి గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా నియంత్రణ ప్రదేశాల్లో పర్యటించారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోన్న కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి కేటీఆర్‌ కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ తీసుకుంటున్న చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్‌ లోకేష్‌కుమార్‌తో కలిసి ఖైరతాబాద్‌, విజయ్‌నగర్‌ కాలనీ, మల్లేపల్లిలో పర్యటించారు. నియత్రంణ ప్రదేశాల్లో ఉన్న వాళ్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియంత్రణ ప్రదేశాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులను అందిస్తున్న విధానాన్ని లోకేష్‌ కుమార్‌ కేటీఆర్‌కు వివరించారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంటైన్‌మెంట్‌ జోన్లలో నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచామని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే లాక్‌డౌన్‌కు సహకరించాలని కేటీఆర్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *