అభివృద్ధే ధ్యేయంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రంగాల్లో సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో నిత్యవసర సరుకుల ధరలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు శాఖలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు… తాజాగా నిత్యవసర సరుకుల ధరలను తగ్గించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆన్లైన్ విధానంలో హాజరయ్యారు.
ఈ సమీక్షలో నిత్యావసర సరుకులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక సాధ్యాసాధ్యాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆ శాఖలకు చెందిన అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, టమాటా, ఉల్లిపాయలు, కందిపప్పు రౌతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే తక్కువకు అందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇక పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులతో పాటు వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సీఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉండాలని కోరారు. ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
డిమాండ్ కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల నియంత్రణకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసానికి కారణాలు విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరలు పెరిగాక తగ్గించే ప్రయత్నం చేయటం, సబ్సిడీలో అందించడం కంటే ముందే ధరల పెరుగుదలకు గల కారణాలను గ్రహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో సైతం పలుమార్లు నిత్యవసర సరుకుల ధరలు అకస్మాత్తుగా పెరగటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరో సారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… గత ఐదేళ్లలో నష్టపోయిన వారికి కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు.
ధరల విషయంలో సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. నిత్యవసరాలు ధరల నియంత్రణకు తాత్కాలికంగా దీర్ఘకాలికంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.