సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గాంచిన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రతన్ టాటా (Ratan Tata) కు ముంబైలోని వైద్యశాలలో చికిత్స అందించారు. అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న రతన్ టాటా (Ratan Tata) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యల కారణంగా వైద్య చికిత్స తీసుకుంటున్న రతన్ టాటా ఆరోగ్య స్థితిపై పలు వార్తా కథనాలు సైతం ఇటీవల వైరల్ గా మారాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా.. వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు అంటూ ట్వీట్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం రతన్ టాటా మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు.
టాటా బాల్యం.. చదువు..
రతన్ టాటా (Ratan Tata) అనే పేరు ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. రతన్ టాటా (Ratan Tata) ఒక వ్యాపార సామ్రాజ్య అధిపతిగానే గుర్తించబడలేదు. ఈయన ఒక వ్యాపార రంగానికే మకుటం లేని మహారాజు. అంతేకాదు యావత్ భారతావని గుర్తుంచుకునే రీతిలో కరోనా కష్టకాలంలో ప్రజలకు అండదండగా నిల్చిన మనసున్న మారాజు. అటువంటి మారాజు ఇకలేరు. రతన్ టాటా (Ratan Tata) 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో 8వతరగతి వరకు టాటా చదువుకున్నారు. అనంతరం సిమ్లా లోని బిషప్ కాటన్ స్కూలులో కూడా టాటా విద్యను కొనసాగించారు. 1955లో హైస్కూల్ నుండి పట్టా పొందిన టాటా.. కార్నల్ యూనివర్సిటీలో చేరారు.
ఇక్కడే ఈయన 1959లో ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తనకు పట్టా అందించిన యూనివర్సిటీకి టాటా 2008లో 50 మిలియన్ల డాలర్లను బహుమతిగా అందించి, తనకు జీవితాన్నిచ్చిన యూనివర్సిటీ రుణాన్ని తీర్చుకున్నారు. 1970లో టాటా గ్రూపులో చేరిన టాటా .. సంస్థను సక్సెస్ వైపు నడిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
రతన్ టాటాకు వరించిన పురస్కారాలు
రతన్ టాటా (Ratan Tata) కు భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, అలాగే పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. అంతేకాదు ఎన్నో యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ను సైతం అందించాయి. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి సక్సెస్ వైపు నడిచిన వ్యాపారవేత్తగా.. పారిశ్రామికవేత్తగా.. వ్యాపార రంగంలో రాణించే వారికి ఆదర్శకులుగా నిలిచారు రతన్ టాటా.
సక్సెస్ కి చిరునామాగా పేరుగాంచిన పలుమార్లు ఓటమిని కూడా చవిచూశారు. అయినా వ్యాపారరంగంలో లాభాలు.. నష్టాలు కామన్.. అనే రీతిలో తుది శ్వాస వరకు కూడా టాటా గ్రూప్ ( Tata Group) ఛైర్మన్ గా కొనసాగి, చివరకు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. యావత్ భారతావని టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.