తిరుమల శ్రీవారికి నివేదించిన తర్వాత తీసుకునే లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. అలాంటి ప్రసాదం కల్తీ అయిందన్న వ్యవహారం ఏపీనే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రులు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ లడ్డూ కల్తీపై ప్రాథమిక నివేదికను ఆయనకు అందజేయగా.. దానిపై చర్చించారు. అలాగే ఆలయ సంప్రోక్షణపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. హిందూవాదులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసనకు దిగారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె వాడారని తేలడంతో గత ప్రభుత్వ తీరుపై హిందూవాదులు మండిపడుతున్నారు. మాజీ సీఎం ఇంటి దగ్గర నిరసనలు చేపట్టారు. దీనికి జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన కారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.
శ్రీవారి ఆలయంలో రేపు మహాశాంతి యాగం చేపట్టనుంది టీటీడీ. కల్తీ నెయ్యి వల్ల జరిగిన అపచారానికి పరిహారంగా యాగం నిర్వహించనున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలు, భక్తుల రద్దీ దృష్ట్యా రేపు ఒకరోజు యాగం నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. యోచిస్తున్నారు. శ్రీవారి ఆనంద నిలయానికి వెనుక పాత పరకామణి మండపంలో ఈ క్రతువు చేపట్టనున్నారు. సాయంత్రంలోగా యాగానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.