ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. తిరుమలలో లడ్డూ కల్తీపై ఆవేదన చెందిన పవన్.. అందుకు ప్రాయశ్చితంగా ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. 11 రోజులపాటు పవన్ కల్యాణ్ ఈ దీక్ష చేయనున్నారు. దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని, లడ్డూ వివాదంలో దోషులకు శిక్ష పడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సంస్కరణల పేరుతో తిరుమలలో అనేక మార్పులు చేసిందన్నారు. టీటీడీపై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
తిరుమల లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని పవన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంత వివాదం జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. ఇతర మతాల్లో ఇలా అపవిత్రం అయితే ఊరుకుంటారా అన్నారు. తప్పు అని చెప్తే ఒకరిని నిందించినట్లా? హిందువులకు మనోభావాలు ఉండవా? ప్రశ్నించారు.
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నెయ్యిలో ప్యూర్ మిల్క్ ఫ్యాట్ ఎస్ వ్యాల్యూ 98.62 రనుంచి 104.32ఉండాలి. కానీ 20 మాత్రమే ఉందని ఎన్డీడీబీ రిపోర్టు తెలిపిందన్నారు. నెయ్యిలో వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతుందని, కానీ ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు. అయోధ్య కోసం కూడా లక్ష లడ్డూలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.