బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడొద్దంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామన్నారు. రూ. 9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదన్నారు. కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తదని తాను ఆశిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలంటూ ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ ఒజ్కికి మృతివార్త చాలా బాధ కలిగించిందన్నారు. అత్యంత డైనమిక్ గా ఉండే ఒజ్కికి ఎంతో తెలివైనవారన్నారు. ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఒజ్కికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.