మమతకు వరుస షాక్‌లు.. మరో ఉప ఎన్నిక నుంచి అభ్యర్థి నిష్క్రమణ..

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ వర్గానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నందిగ్రామ్‌లో అభ్యర్థి సంచితా ప్రధాన్‌ డే నామినేషన్‌ ఉపసంహరించుకున్న మరుసటి రోజే రేజీనగర్‌లోనూ మమత వర్గం అభ్యర్థి రబియుల్‌ ఆలం చౌధురి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. అక్టోబర్‌ 6న రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

రబియుల్‌ ఆలం చౌధురి శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీకి అధికారిక గుర్తు లేకపోవడం, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు. పరిపాలనా ఒత్తిడి వల్ల పలువురు కార్యకర్తలు ప్రాంతాన్ని విడిచి వెళ్లారని చెప్పారు.

శుక్రవారం నందిగ్రామ్‌ అభ్యర్థి సంచితా ప్రధాన్‌ డే కూడా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆమె అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాతే నామినేషన్‌ ఉపసంహరణ నిర్ణయం వెలువడింది. 

నందిగ్రామ్‌లో సంచిత తప్పుకోవడంతో మమతా బెనర్జీ కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మిలన్‌ ప్రధాన్‌ 2007 నాటి హత్య కేసులో అరెస్టయ్యారు. దీంతో అక్కడి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. 

ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరు, గుర్తుపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు పార్టీ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తును తాత్కాలికంగా నిలిపివేసింది. మమతా వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తును కేటాయించింది. ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘కవర్‌’ గుర్తు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.